My Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
My Books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2026, శుక్రవారం

మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల

ఈరోజు వైశాఖ పౌర్ణమి పర్వదినం.

శ్రీహరికి పరమభక్తుడు మరియు మహా  సంకీర్తనాచార్యుడైన  అన్నమయ్య కూడా  ఈరోజే   జన్మించాడు. ఇవాళే బుద్ధునికి కూడా జ్ఞానోదయం కలిగింది. కనుక ఈరోజుకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

నా కలం నుండి వెలువడుతున్న 78 వ పుస్తకంగా 'త్రిపురా రహస్యము' 'ఈ-బుక్' ను నేడు విడుదల చేస్తున్నాను. శాక్తాద్వైత సాంప్రదాయానికి చెందిన మహత్తరమైన గ్రంథాలలో ఇది పేరుగన్నది.

ఇది జ్ఞానఖండము. అంటే, పూర్తిగా జ్ఞానభాగము. చిక్కని శాక్తాద్వైతభావజాలంతో కూడిన దీని శ్లోకార్థములను సాధ్యమైనంత తేలికైన తెలుగుభాషలో వివరించే ప్రయత్నాన్ని ఇందులో చేశాను.

దీనికంటే ముందు మాహాత్మ్యఖండమని ఒక భాగమున్నది. అది లభిస్తున్నది. దీని తరువాత చర్యాఖండమని ఇంకొక భాగమున్నది. అది లభించడం లేదు. ఇవన్నీ కలిపి మొత్తము 12 వేల శ్లోకములని చెప్పబడినది. మొత్తము 'త్రిపురారహస్యము' ఈ మూడు ఖండముల ఉద్గ్రంధము.

మాహాత్మ్యఖండములో 6687 శ్లోకములున్నాయి. జ్ఞానఖండములో 2163 శ్లోకములున్నాయి. కనుక చర్యాఖండములో 3150 శ్లోకములుండాలి. దేవీ సాధనావిధానములన్నీ దానిలోనే ఉన్నవి. కానీ అది దొరకడం లేదు. ఏ తురకల రాక్షసకాండలోనో తగలబడిపోయి ఉంటుంది. వీటిలో ప్రస్తుతము లభిస్తున్న జ్ఞానఖండమును మాత్రము ఇక్కడ విడుదల చేస్తున్నాము.

దత్తాత్రేయులవారు మహాజ్ఞాని మరియు మహాసిద్ధుడు. ఈయన పరశురాముని గురువు. ఇద్దరూ ఋషిపుత్రులే. ఒకరు అత్రితనయుడైతే, మరియొకరు జమదగ్ని తనయుడు. ఒకరు త్రిమూర్తిస్వరూపుడైతే, మరియొకడు దశావతారములలో ఒకరు. కనుక, వీరి సంవాదరూపమైన 'త్రిపురారహస్యము' నకు మన అద్వైతవేదాంతవాఙ్మయములో అత్యంతప్రముఖమైన స్థానమున్నది.

దత్తాత్రేయులకు అవతారములు లేవు. ఉన్నవని నేటివారు కల్పించారు. ప్రతివారినీ దత్తాత్రేయుల అవతారమని చెప్పుకోవడం కలిమాయలలో ఒకటి. అది వ్యాపారం మాత్రమే గాని, సత్యం కాదు. అన్నింటికీ అతీతుడై, పరమజ్ఞానరూపియైన దత్తాత్రేయుడు, మానవరూపంలో తిరిగి అవతరించడం, అల్పములైన మహత్యాలను అద్భుతాలను చెయ్యడం జరిగేపనులు కావని దత్తతత్త్వం కొద్దిగా తెలిసిన చిన్నపిల్లలకైనా అర్థమౌతుంది.

ముఖ్యంగా ఈ పిచ్చిభ్రమ మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నది. దానిని చూసి మన తెలుగువాళ్లు వాతలు పెట్టుకుంటున్నారు. కొంతమంది సోకాల్డ్ స్వామీజీలు దీనిని ప్రోత్సహిస్తున్నారు.

స్వాములు సత్యాన్ని చెప్పాలి. ఆశలకు అతీతంగా ఉండాలి. కానీ అలా లేరు. స్వార్ధం కోసం అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారు. అధర్మాన్ని అనుసరిస్తూ, ధర్మక్షీణతకు కారకులౌతున్నారు. రక్షించవలసినవారు చెడగొట్టడం, దిద్దవలసినవారు పెడదారి పట్టించడం కలిమాయలలో ఒకటి.

నేడు ప్రతివారినీ దత్తాత్రేయుని అవతారమని చెబుతున్నారు. అలా చెప్పుకుంటున్నవారు తెలుగురాష్ట్రాలలో కనీసం నలుగురున్నారు.  ధనదాహం, కీర్తికండూతి, అహంభావం - వీటికోసం ఏ విలువలనైనా వదులుకోవడానికి సిద్ధపడటం ఈ నాలుగూ తెలుగువారి దౌర్భాగ్యాలు. హిందువులలో తమ మతాన్ని గురించిన అసలైన జ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఈ అజ్ఞానానికి మరియు దత్తాత్రేయుని పేరుతోను, ఇతర దేవతల పేర్లతోను జరుగుతున్న మతవ్యాపారానికి అంతం కలుగుతుంది.

త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది. రమణభక్తులైన శ్రీ మునగాల వెంకట్రామయ్యగారి ఇంగ్లీష్ అనువాదమే ఇప్పటివరకూ మనకు లభిస్తున్నది. ఇప్పుడు నా ఇంగ్లీషు అనువాదం కూడా మీ ముందుకు వస్తుంది.

నవీనకాలపు జ్ఞానులలో ముఖ్యులైన రమణమహర్షి ఈ గ్రంధమును ఎంతగానో అభిమానించేవారు. తన సంభాషణల మధ్యలో దీనినుంచి శ్లోకాలను కోట్ చేసేవారు. దీనిని బట్టి ఈ గ్రంధము యొక్క విలువ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

సృష్టి ఎలా జరిగిందన్నది కాశ్మీరశైవమనబడే త్రికసంప్రదాయంలో చాలా చక్కగా వివరించబడింది. ఇటువంటి వివరణ ఏ మతంలోనూ, ఏ గ్రంథంలోనూ ఇవ్వబడి లేదు. అలా చెప్పగలగాలంటే ఆయా మతాలలో గొప్పవైన మేధాశక్తి, పరిశీలన, సత్యతృష్ణ, ఋజుజీవనములుండాలి. అవి లేవుగా మరి !

త్రికమనేది ఆధ్యాత్మికలోకంలో అత్యున్నతమైన సాంప్రదాయము, దీనికే శివాద్వైతమని పేరున్నది. ప్రస్తుతగ్రంధము శాక్తాద్వైత సాంప్రదాయమునకు చెందినది. శివశక్తులకు వేర్వేరుగా ఇవ్వబడిన ప్రాముఖ్యత తప్ప, మిగిలిన భావజాలమంతా ఈ రెండింటిలో దాదాపు ఒక్కటిగానే కనిపిస్తుంది. ఆ వివరణను, జ్ఞానులలోని భేదములెలా ఉంటాయన్న వివరమును, ఇతరములైన ఎన్నో అంతుబట్టని జ్ఞానరహస్యములను కూడా ఈ గ్రంధంలో మీరు చూడవచ్చు.

ఈనాడు సైన్సు ఊహిస్తున్న మల్టీ డైమెన్షనల్ యూనివర్స్, టైం ట్రావెల్, హోలోగ్రామిక్ మోడల్  ఆఫ్ యూనివర్స్ మొదలైన భావాలు ఈ ప్రాచీనగ్రంధంలో దాదాపు వెయ్యి సంవత్సరాలనాడే చెప్పబడి ఉండటం చూడవచ్చు.

ప్రస్తుతం ఈ బుక్ గా ఇక్కడ లభిస్తుంది.  త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా లభిస్తుంది. ఈ ఏడాది జరుగబోయే హైద్రాబాద్, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లలో మా స్టాల్లో దొరుకుతుంది. 

యధావిధిగా, ఈ గ్రంథరచనలో నాకు సహకరించిన శిష్యులకందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

మహత్తరమైన ఈ గ్రంధమునకు నాచేత చేయబడిన వ్యాఖ్యానము జిజ్ఞాసువులకు, జ్ఞానపిపాసులకు అమితానందమును కలిగిస్తుందని, తెలుగుభాషలో ఈ గ్రంధము  ఒక మణిపూసగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను.
read more " మా 78 వ పుస్తకం 'త్రిపురా రహస్యము' విడుదల "

1, ఫిబ్రవరి 2026, ఆదివారం

మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 77 వ గ్రంధంగా, 'జ్ఞానసంకలినీ తంత్రము' అనబడే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. 


తంత్రములన్నీ శివశక్తుల సంవాదరూపములై యుంటాయి. ఈ గ్రంధము కూడా అటువంటిదే. దీనియొక్క పేరునుబట్టి, అనేక ఇతరతంత్రముల నుండి సేకరించబడిన జ్ఞానము ఈ గ్రంధములో ఒకచోట కూర్చబడినదని తెలుస్తున్నది.


పెద్దదైన ఏ ఇతర గ్రంధమునకూ ఇది అనుబంధము కాకుండా, స్వతంత్రరచనగా కనిపిస్తున్నది. దీనిలోని భావములు కూడా, వివిధ యోగోపనిషత్తులనుండి, జ్ఞానోపనిషత్తులనుండి సేకరించబడినట్లుగా ఉన్నాయి. దీని ప్రతిధ్వనులు భగవద్గీతలో కూడా మనకు దర్శనమిస్తాయి.


దీనిలో సృష్టిక్రమము, పంచభూతములు, చక్రములు, నాడులు, వాయువులు, వాటియొక్క పనులు, ఓంకారము, దానియొక్క మూడుభాగములు, ఆయాభాగముల తత్త్వములు, కుండలినీసాధన మొదలైన విషయములు వివరింపబడినాయి. ఆచారములు, తంతులకు భిన్నమైన జ్ఞానమార్గము, యోగశాస్త్రముతో మేళవింపబడి దీనిలో దర్శనమిస్తున్నది.


మధ్యయుగములనాటి అనేకగ్రంథములలో వలె, దీనిలో కూడా, వేదాంతమును, యోగశాస్త్రమును, తంత్రశాస్త్రమును సమన్వయపరచాలనిన ప్రయత్నం కనిపిస్తుంది. వేదాంత, యోగ, తంత్రశాస్త్రాభిమానులకు, జిజ్ఞాసువులకు మరియు సాధకులకు ఈ గ్రంధం ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసము.


ఈ గ్రంధము కూడా తిరుపతి బుక్ ఫెస్టివల్ లోని 35 వ నంబరు స్టాల్లో లభిస్తుంది. లేదా మా తక్కిన గ్రంధాలలాగే ఆన్లైన్ లో ఇక్కడ లభిస్తుంది. జిజ్ఞాసువులు, పాఠకులు మరియు మా అభిమానులు దీనిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా 77 వ గ్రంధంగా 'జ్ఞానసంకలినీ తంత్రము' విడుదల "

9, డిసెంబర్ 2025, మంగళవారం

' వైద్యజ్యోతిషం రెండవభాగం ' ప్రింట్ పుస్తకం విడుదల

2022 డిసెంబర్ లో 'Medical Astrology - Part 2' 'ఈ-బుక్' ను అమెరికానుండి విడుదలచేశాను. అప్పటినుండి ప్రయత్నిస్తుంటే, దాని తెలుగుఅనువాదం ఇప్పటికి పూర్తయింది. అందుకని ఈరోజున దీనియొక్క తెలుగు 'ఈ-బుక్' ను విడుదల చేస్తున్నాను. 

ఇది నా కలంనుండి వెలువడుతున్న 76 వ పుస్తకం.

ఒక వారంలో ఇది ప్రింట్ అయ్యి, 19 వ తేదీనుండి మొదలౌతున్న హైద్రాబాద్ పుస్తకమహోత్సవంలో  పంచవటిస్టాల్లో అందుబాటులోకి వస్తుంది.

మొదటిభాగంలో లాగానే దీనిలోకూడా నూరుజాతకాల విశ్లేషణలతో జలుబు నుండి ఎయిడ్స్ దాకా అనేకరకాలైన వ్యాధులను జాతకాలలో ఎలా గుర్తించాలో వివరించాను. 2022 లో మొదటిభాగం విడుదల అయినప్పటినుండి, తెలుగుపుస్తకం కోసం అనేకమంది జ్యోతిషవిద్యార్థులు, తెలుగుయూనివర్సిటీ నుండి M.A.జ్యోతిషం కోర్సు చేసినవారు, చేస్తున్నవారు అడుగుతున్నారు. ఇప్పటికి ఇది విడుదల అవుతున్నది.

2026 లో, ఇంకొక నూరు జాతకాలతో వైద్యజ్యోతిషం మూడవభాగాన్ని విడుదల చేస్తాను. ఈ విధంగా పదిభాగాలను వ్రాయాలన్నది నా సంకల్పం. మానవజాతిని బాధపెడుతున్న సమస్తరోగాలను జాతకపరంగా ఎలా గుర్తించాలో మొత్తం వెయ్యిజాతకాల విశ్లేషణలతో వివరించే ఈ గ్రంధాలు ప్రపంచ జ్యోతిషచరిత్రలోనే అరుదైన రీసెర్చిగా మిగిలిపోతాయి.

ఈ గ్రంధాన్ని ప్రచురించడంలో తోడ్పడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. ఈ పుస్తకంకూడా జ్యోతిషాభిమానులను ఎంతగానో అలరిస్తుందని భావిస్తున్నాను.

ప్రస్తుతానికి  ఈ బుక్ ఇక్కడ లభిస్తుంది.

read more " ' వైద్యజ్యోతిషం రెండవభాగం ' ప్రింట్ పుస్తకం విడుదల "

16, నవంబర్ 2025, ఆదివారం

మా 75 వ పుస్తకం ' దేవీగీత ' విడుదల

మా 75 వ పుస్తకంగా 'దేవీగీత' అనే ప్రాచీనగ్రంధమునకు నా వ్యాఖ్యానమును నేడు 
విడుదల చేస్తున్నాను.

100 గ్రంధములను వ్రాయాలన్న నా సంకల్పము 75 వరకూ వచ్చినది. తక్కిన 25 గ్రంథముల వరుసలో 'దేవీగీత' కూడా ఉన్నది. కానీ వెనుకవరుసలో ఉన్నది. దానికంటే ముందుగా నడుస్తున్న పుస్తకములు కొన్ని ఉన్నాయి. ఈ మధ్యలో మిత్రుడు పాలపర్తి శ్రీకాంతశర్మ ఫోనుచేసి 'దేవీగీత' కు మీరు వ్యాఖ్యానము వ్రాస్తే బాగుంటుందని సూచించినాడు. శ్రీకాంత్ నాకు 15 ఏళ్ళనుంచీ మిత్రుడు. సన్మిత్రుల సూచన తప్పక పాటించవలసినదే గనుక, వెనుకవరుసలో ఉన్న ఈ గ్రంధమును ముందుకు తెచ్చి, పూర్తి చేసి, నేడు విడుదల చేస్తున్నాను.  

ఇది 800 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము 'దేవీభాగవత పురాణము' లోనిది. విషయవివరణలోను, ఉపాసనామార్గముల సమన్వయ విధానంలోను, దీనికి భగవద్గీతకు చాలా పోలికలున్నాయి.

ఈ గ్రంధములో పది అధ్యాయములున్నాయి. అవి, పరబ్రహ్మతత్త్వము, మాయాతత్త్వము, సృష్టిక్రమము, జ్ఞాన-యోగ-భక్తిమార్గములను, చతుర్విధభక్తులను, దేవియొక్క క్షేత్రములను, పూజావిధానములు, ఉత్సవములు, వ్రతములను, జగదంబయొక్క బాహ్యాంతరిక ఉపాసనావిధానములను వివరించినవి.

వేదాంతప్రతిపాదితమైన బ్రహ్మతత్త్వమును, తంత్రోక్తమైన జగదంబయొక్క ఉపాసనావిధానమును, యోగశాస్త్రమును,  మంత్రయోగమును, కుండలినీయోగమును, సతీదేవి మరియు గౌరీదేవుల ప్రాచీనచరిత్రలతో సమన్వయము గావించే ప్రయత్నము దీనిలో గోచరిస్తుంది. 

ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులందిస్తున్నాను. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది. డిసెంబర్ 19 నుండి జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో అందుబాటులో ఉంటుంది.

శాక్తతంత్రాభిమానులకు, అమ్మవారి భక్తులకు ఈ గ్రంధం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.
read more " మా 75 వ పుస్తకం ' దేవీగీత ' విడుదల "

2, అక్టోబర్ 2025, గురువారం

మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 74 వ పుస్తకంగా 'యోగినీ హృదయము' అనే ప్రాచీన తంత్రగ్రంధమునకు నా వ్యాఖ్యానమును 
ఈ నవరాత్రులలో విడుదల చేస్తున్నాను. ఇది దాదాపు 1000 సంవత్సరాల నాటి ప్రాచీనగ్రంధము. దీనికి నిత్యాహృదయమని, సుందరీహృదయమని పేర్లున్నాయి.

శ్రీయంత్రములో నవావరణలున్నాయి. ఆయా ఆవరణదేవతలను యోగినులంటారు. వారిపేర్లు ఖడ్గమాలాస్తోత్రంలో వస్తాయి. ఆ యోగినుల యొక్క ఉపాసనను ఏ విధముగా చేయాలనిన సారమును వివరిస్తుంది గనుక, ఈ గ్రంధమునకు 'యోగినీ హృదయమని' పేరు పెట్టబడింది.  

ఇది వామాచార శ్రీవిద్యోపాసనకు చెందినది. వామకేశ్వర తంత్రములోని ఒక భాగమని కొందరు పండితుల నమ్మిక కాగా, ఇది ప్రత్యేకమైన గ్రంథమని, వామకేశ్వర తంత్రమునకు దీనికి సంబంధం లేదని మరి కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇది వామాచార శ్రీవిద్యోపాసనా గ్రంధమే. దీనిలో మన్మధోపాసితమైన కాదివిద్య చెప్పబడింది.

ఈ గ్రంధములో మూడు అధ్యాయములున్నాయి. అవి, చక్రసంకేతము, మంత్రసంకేతము, పూజాసంకేతములనిన పేర్లతో ఉన్నాయి. శ్రీచక్రముయొక్క వివిధ ఆవరణలు, వాటి అర్ధములు మొదటి అధ్యాయములో ఉన్నాయి. మంత్రభాగము, చక్రేశ్వరీ దేవతల వివరణ, ఆయా మంత్రార్ధములు రెండవ అధ్యాయంలో ఉన్నాయి.  శ్రీచక్రమును వామాచారపద్ధతిలో ఏ విధముగా పూజించాలనిన వివరము మూడవ అధ్యాయంలో ఇవ్వబడింది.

ఎన్నో తంత్రరహస్యముల సమాహారమైన ఈ గ్రంధాన్ని విజయదశమి నాడు విడుదల చేయడం కాకతాళీయం కాదని నేను భావిస్తున్నాను. ఈ గ్రంధాన్ని వ్రాసి, ప్రచురించే పనిలో సహాయపడిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. 

'ఈ - బుక్' ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

శ్రీవిద్యోపాసకులకు, శాక్తతంత్రాభిమానులకు, నా వ్యాఖ్యానం ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను.
read more " మా 74 వ పుస్తకం 'యోగినీ హృదయము' విడుదల "

11, ఆగస్టు 2025, సోమవారం

మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 73 వ పుస్తకంగా 'పది శాక్తోపనిషత్తులు' నేడు విడుదల అవుతున్నది.

ఇప్పటిదాకా నేను ప్రధానమైన వేదాంతోపనిషత్తులను, యోగోపనిషత్తులను వ్యాఖ్యానించి మా సంస్థనుండి పుస్తకములుగా ప్రకటించాను. కానీ శక్తిప్రధానములైన ఉపనిషత్తులకు వ్యాఖ్యానమును వ్రాయలేదు. ఆ పనిని ఇప్పుడు చేశాను. ఆ వివరమంతా ఈ గ్రంధపు ముందుమాటలో చర్చించాను.

దీనిలో 1. కౌలోపనిషత్తు 2. త్రిపురా మహోపనిషత్తు 3. భావనోపనిషత్తు 4. అరుణోపనిషత్తు 5. బహ్వృచోపనిషత్తు 6. కాళికోపనిషత్తు 7. తారోపనిషత్తు 8. సరస్వతీ రహస్యోపనిషత్తు 9. త్రిపురాతాపినీ ఉపనిషత్తు 10. సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తులకు నా వ్యాఖ్యానం మీకు లభిస్తుంది.

ఇవి, నాలుగువేదములనుండి తీసుకున్నవి అయినప్పటికీ, అధర్వణవేదం నుండి ఎక్కువగా ఉన్నాయి. తంత్రప్రధానములైన ఉపనిషత్తులు దానిలోనే మనకు కనిపిస్తాయి.

బ్లాగులో వ్రాతలను నేను బాగా తగ్గించినప్పటికీ, రచనావ్యాసంగానికి మాత్రం చుక్కపెట్టలేదు. ఉన్నతభావ సంప్రేరితములైన ప్రాచీనగ్రంథముల అధ్యయనము, వ్యాఖ్యానము, సాధన మరియు బోధనలు నిరాఘాటంగా మా ఆశ్రమంలో  కొనసాగుతూనే ఉన్నాయి. అవే లేకపోతే, ఈ చెత్తలోకంలో చెత్తమనుషుల మధ్యన మనం మనుగడ సాగించేదెలా మరి?

నేను సమాజానికి దూరంగా ఉంటున్నప్పటికీ, నిజమైన సాధకులకు మా ఆశ్రమం తలుపులు మాత్రం ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ గ్రంధాన్ని ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించిన నా శిష్యులందరికీ ఆశీస్సులు. యధావిధిగా ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఆగస్టు 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవం సమయానికి దీనితోబాటు మరికొన్ని మా అముద్రిత గ్రంధాలను ముద్రించి, మా స్టాల్లో అందుబాటులో ఉంచే ప్రయత్నం జరుగుతున్నది.

మా మిగతా గ్రంధాలలాగా దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
read more " మా 73 వ పుస్తకం 'పది శాక్తోపనిషత్తులు' విడుదల "

10, ఆగస్టు 2025, ఆదివారం

'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల

నేను మొట్టమొదట వ్రాసిన పుస్తకం 'శ్రీవిద్యారహస్యం'. దీని మొదటి ముద్రణ పదేళ్లక్రితం 2015 లో జరిగింది. ఆ తరువాత పాఠకుల డిమాండ్ ను బట్టి 2019 లో రెండవముద్రణ జరిగింది. ఇప్పుడు 2025 లో మూడవ ముద్రణ జరిగింది. అభిమానుల సూచనలను బట్టి ప్రతిసారీ దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతున్నది.

మొదటి ముద్రణలో 1318 పద్యములున్నాయి. మూడవముద్రణలో 1731 పద్యములైనాయి. అంటే దాదాపు 400 పద్యములను అదనంగా వ్రాసి చేర్చడం జరిగింది. అంతేగాక, అదనపు అధ్యాయములను కూడా చేర్చడం జరిగింది.

ప్రస్తుతపు మూడవముద్రణలో చేర్చబడిన ముఖ్యాంశము మంత్రభాగపు వివరణ. మొదటి రెండు ముద్రణలలో మంత్రభాగాన్ని పెద్దగా స్పృశించలేదు. కారణం, మంత్రములను పుస్తకరూపంలో ఇవ్వడం ఎందుకని భావించడమే. కానీ,  శ్రీవిద్యకు మంత్రమే ప్రాణం గనుక అది కూడా ఉండాలని కొందరు అభిమానులు పదే పదే చెప్పడంతో, దానిని ఈ ముద్రణలో వివరంగా చర్చించడం జరిగింది. అయితే, గురూపదేశం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పడం జరిగింది.

మంత్రములను పుస్తకముల నుండి గ్రహించవచ్చు. కానీ వాటియొక్క జపధ్యానవిధానములను (తంత్రమును) మాత్రం గురూపదేశపూర్వకంగానే నేర్చుకోవలసి ఉంటుంది. 

2015 తరువాత ఈ పదేళ్లలో 70 పైగా పుస్తకములను నేను వ్రాసినప్పటికీ, మొట్టమొదటిసారిగా వ్రాసిన 'శ్రీవిద్యారహస్యం' మాత్రం నేటికీ పాఠకుల అభిమానగ్రంధంగా నిలిచి ఉన్నది. నా భావజాలాన్ని, మా సాధనామార్గాన్ని చదువరులకు స్పష్టం చేస్తూనే ఉన్నది.

ఈ మూడవముద్రణ సందర్భంగా నా శిష్యులకు, అభిమానులకు ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ నెల 15 నుండి 24 వరకూ ఒంగోలులో జరుగబోతున్న పుస్తకమహోత్సవంలో 'పంచవటి స్టాల్' లో 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణతో సహా  మా పుస్తకాలన్నీ లభిస్తాయి.

ఇది మా ఆశ్రమానికి దగ్గరే కాబట్టి, పుస్తకప్రాంగణంలో నేను కూడా మీకు అప్పుడపుడు కనిపిస్తాను. పుస్తకప్రాంగణంలో కలుసుకుందాం.

read more " 'శ్రీవిద్యారహస్యం' మూడవ ముద్రణ విడుదల "

12, మే 2025, సోమవారం

మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల

నేడు బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి పండుగరోజు. అందుకని, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీస్వామివారు రచించిన  'ఆత్మవిద్యా విలాసము' అనే గ్రంధమునకు నా వ్యాఖ్యానమును మా 72 వ పుస్తకంగా ఈ పవిత్రదినాన విడుదల చేస్తున్నాము.

యోగీంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు వ్రాసిన 'సదాశివేంద్ర స్తవము' ను కూడా ఇందులో పొందుపరచాము.

స్వామివారి గురించి  ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.

'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి. 

రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.

శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.

ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.

అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.

అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే  దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !

యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.

read more " మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల "

2, మే 2025, శుక్రవారం

మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల

నేడు వైశాఖ శుక్లపంచమి.  ఆదిశంకరులవారి పవిత్ర జన్మదినం.43 ఏళ్ల క్రితం, మా గురువర్యులైన స్వామి నందానందగారి సమక్షంలో సరిగ్గా  ఈనాడే నాకు ఉపనయనం జరిగింది. ఆ విధంగా, పంచవటి శిష్యులకు ఈ రోజు రెండువిధాలుగా ముఖ్యమైన రోజు అవుతున్నది.

'శంకరశ్శంకరస్సాక్షాత్' (శంకరులు సాక్షాత్తు ఈశ్వరుడే) అనిపించుకున్న మహనీయుడు పుట్టిన పవిత్రమైన రోజు ఇది. వేదములలో దాగి ఉన్న అద్వైతమునకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి, లోకానికి బోధించిన ఘనుడాయన. అమానుషములైన ఎన్నో పనులను కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో సాధించిన మహనీయుడాయన.

తన పొట్ట, తన సుఖం మాత్రమే చూచుకునే అల్పులు, కోట్లాదిమంది పురుగులలాగా ఈ లోకంలో పుట్టి పోతుంటారు. కానీ ఇటువంటి దివ్యాత్ములు ఎప్పుడో ఒకసారి మాత్రమే పుడతారు. భారతజాతికి, సనాతనధర్మానికి ఒక దిశను కల్పించిన మహనీయుడాయన. వేలాది ఏళ్లకు ఒకసారి మాత్రమే అటువంటి మహనీయుల జననం జరుగుతుంది. వారి చరిత్రను నేను వ్రాసిన 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే గ్రంధంలో వివరంగా చర్చించాను.

ఇటువంటి పవిత్రమైన ఈ రోజున, మా 'పంచవటి' నుండి వెలువడుతున్న 71 వ పుస్తకంగా 'గీతా కంద మరందము' అనే గ్రంధాన్ని విడుదల చేస్తున్నాము.

ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారు మధురంగా ఆలపించిన 108 గీతా శ్లోకములకు మరికొన్ని శ్లోకములను చేర్చి మొత్తము 150 కంద పద్యములలో రచయిత్రి ఈ పుస్తకమును వ్రాశారు. అందుకే 'కంద మరందము' అని పేరు పెట్టారు. మకరందము అనినా, మరందము అనినా, అర్ధం ఒకటే.

అచ్చ తెలుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాలలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.

వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.

ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు. 

అయితే,  ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.

రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?

ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దో గొప్పో చలం గారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.

బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా  ఈ పుస్తకమును అనుకోవచ్చు.

కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.

యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.

కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల "

27, ఏప్రిల్ 2025, ఆదివారం

మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 70 వ పుస్తకంగా, శ్రీ సదాశివబ్రహ్మేంద్రసరస్వతీస్వామివారు రచించిన 'శివయోగదీపిక' అనబడే సంస్కృతగ్రంధమునకు తెలుగు వ్యాఖ్యానము నేడు వెలువడుతున్నది. దీని మాతృక 300-400 ఏళ్ల క్రిందటిది.

16-17  శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీ పరమశివేంద్ర సరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు  58 వ ఆచార్యునిగా ఉన్నారు.


సదాశివయోగీంద్రులు వెలనాటి నియోగి బ్రాహ్మణకుటుంబంలో శ్రీవత్సస గోత్రంలో జన్మించారు. నేను కూడా అదే కావడం నా అదృష్టం. కనుక స్వామివారు మా పూర్వీకులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్యప్రాంతం. ముఖ్యంగా గుంటూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలను ఆ కాలంలో వెలనాడు అనేవారు.


ముస్లిముల రాక్షసదండయాత్రలనుండి, వారు పెట్టిన హింసలు, అరాచకాలనుండి తప్పించుకోవడానికి, తమ ఆడవారిని తమ కుటుంబాలను కాపాడుకోవడానికి, ఆ కాలంలో అనేక తెలుగుకుటుంబాలు వారివారి ఆస్తిపాస్తులను వదలిపెట్టి, కట్టుబట్టలతో తమిళనాడులోని కుంభకోణం కోయంబత్తూరు మొదలైన ప్రాంతాలకు పారిపోయి అక్కడ క్రొత్తజీవితాన్ని మొదలుపెట్టాయి. అటువంటి కుటుంబాలలో వీరిది కూడా ఒకటి.


వీరి పూర్వనామధేయం శివరామకృష్ణశర్మ. పరమశివేంద్రులవారి వద్ద ఉపదేశమును పొంది, అనేక ఏళ్లపాటు కావేరీతీరంలో తపస్సు చేసిన తరువాత ఈయన బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందారు. శాస్త్రాలలో ఎంతో ఉన్నతంగా కొనియాడబడిన అవధూతస్థితిని అందుకున్న అతికొద్దిమంది నవీనులలో ఈయనొకరు. వీరి సజీవసమాధి తమిళనాడులోని కరూర్ జిల్లాలో గల నేరూరు గ్రామంలో ఉన్నది.


సదాశివయోగీన్డ్రుల గురించిన అనేక మహిమలు మరియు గాధలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరమహంస యోగానందగారు తన పుస్తకం Autobiography of a yogi లో పొందుపరచారు. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను సదాశివ బ్రహ్మేంద్రస్వామి రచించారు. వాటిలో బ్రహ్మసూత్రములకు, యోగసూత్రములకు వ్రాసిన వ్యాఖ్యానములు పేరెన్నిక గన్నవి.


పిబరే రామరసం, భజరే గోపాలం మానస, గాయతి వనమాలీ మధురం, ఖేలతి మమ హృదయే రామ, మానస సంచరరే బ్రహ్మణి, స్థిరతా నహినహి రే, మొదలైన కీర్తనలు ఈనాటికీ కీర్తనాప్రియులైన భక్తుల నోళ్ళలో నానుతూ ఉంటాయి. బాలమురళీకృష్ణ,  పురుషోత్తమానందస్వామి వంటి మధురగాయకులు వీటిని ఎంతో శ్రావ్యంగా గానం చేశారు.


వీరి గ్రంధములలో ఒకటి - మంత్ర, లయ, హఠ, రాజ, భక్తి, జ్ఞానయోగముల మేలుకలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో యోగసాధనల సంకలనా సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.


ఇటువంటి మహనీయుడు వ్రాసిన ఈ అద్భుతగ్రంధమును నా వ్యాఖ్యానంతో ఆయనయొక్క మాతృభాష అయిన తెలుగులోకి తేగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకమును వ్రాయడంలో నాకు అనుక్షణం చేదోడువాదోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి, శిష్యులు అఖిల. లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.


ప్రస్తుతం ఈ పుస్తకం E-Book గా అందుబాటులోకి వస్తున్నది. యధావిధిగా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.


మా ఇతర గ్రంధములను ఆదరించినట్లే అద్భుతమైన ఈ గ్రంధాన్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

read more " మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల "

23, ఏప్రిల్ 2025, బుధవారం

మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల

ఇంతకు ముందు నాచే తెలుగులో వ్రాయబడిన 'భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము' అనే పరిశోధనా గ్రంధం, ఇప్పుడు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడి, Indian Astro Numerology అనే E-Book గా నేడు విడుదల అవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి  52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.

ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.  

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.

తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.

ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.

read more " మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల "

18, డిసెంబర్ 2024, బుధవారం

మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల


నా కలం నుండి వెలువడుతున్న 68 వ పుస్తకంగా 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే అద్భుతమైన పరిశోధనాగ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాము.

దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి,  కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి. 

వీరందరి జీవితాలలోని వివిధఘట్టాలను 220 జాతకచక్రాల ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించడం జరిగింది.

వీరిలో ఎవరికీ సరియైన జననసమయాలు రికార్డ్ చేయబడి లేవు. కనుక అందరికీ జననకాల సంస్కరణ అవసరమైంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది ఎలా చేశానో కూడా ఆయా అధ్యాయాలలో వివరించాను.  జ్యోతిష శాస్త్రాభిమానులను ఈ విశ్లేషణలు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.

సంస్కృత మహాభారతం నుండి శ్రీమద్భాగవతం నుండి తీసుకున్న ఖగోళసూచనలతో శ్రీకృష్ణుని జాతకాన్ని రాబట్టటం జరిగింది. మిగతా వారికి కూడా వారి వారి జీవిత సంఘటనలతో పోల్చి జననకాల సంస్ఖరణ చేయడం జరిగింది. అంతేగాక, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరుల అసలైన జనన సంవత్సరాలను జ్యోతిషశాస్త్రపు సూత్రాల ఆధారంగా రాబట్టి నిరూపించడం జరిగింది. 

ప్రస్తుతం చరిత్రపుస్తకాలలో మనం చదువుతున్న వీరి జనన సంవత్సరాలన్నీ తప్పుల తడికలే. ఇవి యూరోపియన్ మరియు లెఫ్టిస్ట్ కుహనా చరిత్రకారులు లోకాన్ని తప్పుద్రోవ పట్టించడం కోసం  వాస్తవాలను వక్రీకరించి వ్రాసినవి. ఈ విషయాన్ని ఈ గ్రంధంలో స్పష్టంగా నిరూపించి చూపించి, వీరి అసలైన జనన సంవత్సరాలను మాత్రమేగాక, జననతిధులను, జనన సమయాలను కూడా రాబట్టి చూపించాను.

అవసరమైన చోట్ల ఆయా మహనీయుల తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, పిల్లల జాతకాలను కూడా ఇస్తూ, వారికి వీరికి ఉన్న జాతకసంబంధాలను (జన్యు జ్యోతిషాన్ని) కూడా వివరించాను.

ఈ క్రమంలో, ఎప్పటినుంచో అంతుబట్టకుండా ఉన్న కొన్ని చారిత్రక చిక్కుముడులను సవరించాను. ఉదాహరణకు, చైతన్య మహాప్రభువు ఎలా చనిపోయారు? ఆయన యొక్క మరణం సహజమా? అసహజమా? దానికి కారణం అనారోగ్యమా? ప్రమాదమా? హత్యా? అనేది ఇప్పటికీ తేలని చిక్కుప్రశ్నగా చరిత్రకారులను వెక్కిరిస్తున్నది. దీనిని స్పష్టంగా తేల్చి, పరిష్కరించి చూపించాను.

జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.

వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.

ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.

ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.

దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 

జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.

పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా  ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.

ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.

అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.

ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు,  నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.

read more " మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల "

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "

24, డిసెంబర్ 2023, ఆదివారం

మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల

వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మొదలై, నిన్నటి నుండి మా ఆశ్రమంలో మొదటి  స్పిరిట్యువల్ రిట్రీట్ జరుగుతున్నది. ఇది మూడు రోజులపాటు జరిగే కార్యక్రమం. ఇంతకు ముందు పంచవటి సంస్థలో ఎన్నో రిట్రీట్స్ జరిగినప్పటికీ, ఆశ్రమం మొదలైన తరువాత జరుగుతున్న మొదటి రిట్రీట్ మాత్రం ఇదే.

ఈ రిట్రీట్ లో భాగంగా ఈ రోజున మా క్రొత్తపుస్తకం 'స్వర చింతామణి' ని విడుదల చేస్తున్నాము. ఇది శ్వేతకేతుయోగిచే రచించబడిన ప్రాచీన స్వరశాస్త్ర గ్రంధము. దీనికి నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. ఇది నా కలం నుండి వెలువడుతున్న 62 వ గ్రంధము.

కఠినములైన జ్యోతిష్య శాస్త్ర సూత్రముల జోలికి పోకుండా, కేవలం రెండు స్వరములు, అయిదు తత్త్వముల ఆధారంగా త్రికాలజ్ఞానమును పొందే విధానములు ఈ గ్రంధంలో చెప్పబడినాయి. మానవ జీవితంలో జరిగే సమస్తమునూ ఈ విధానం ద్వారా తేలికగా అర్ధం చేసుకోవచ్చు. అంతేగాక, ప్రశ్న విధానమును ఉపయోగించి భవిష్యత్తును గ్రహించవచ్చు. దూరంగా జరుగుతున్న సంఘటనలను  కూడా తెలుసుకోవచ్చు.

ఆయుర్వేదము, వశీకరణము, వాజీకరణము, అనేక రోగములకు పనికి వచ్చే మూలికా యోగములు మొదలైనవి ఈ గ్రంధపు ప్రత్యేకతలు.

పురుషార్ధములైన ధర్మ, అర్ధ, కామ, మోక్షములను శ్వాస ద్వారా పొందే విధానములను ఈ గ్రంధం తేటతెల్లం చేస్తున్నది. మానవజీవితానికి ఉపయోగపడే అత్యుత్తమములైన గ్రంధములలో ఇది ఒకటి. అందుకే దీనికి నా వ్యాఖ్యానమును వ్రాశాను.

ఈ గ్రంధం వ్రాయడంలో, ప్రచురించడంలో నాకు తోడ్పడిన సరళాదేవి, అఖిల. లలిత,  ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు నా ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా మా వెబ్ సైట్ నుండి ఇక్కడ లభిస్తుంది.
read more " మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల "

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల

అమెరికానుండి వచ్చిన తరువాత, ఆశ్రమ పనులలో పడి, గ్రంథరచనకు, ముఖ్యమైన విషయాలపైన వీడియోలు చేయడానికి అడ్డుకట్ట వేసి ఆరునెలలు అయింది. ప్రస్తుతం ఆశ్రమం పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. కనుక గ్రంథరచనను మళ్ళీ మొదలుపెట్టాను. అందుకోసం కొన్నినాళ్ళబట్టి జిల్లెళ్ళమూడిలో ఉంటూ ఈ గ్రంధమును పూర్తి గావించాను.

స్వరశాస్త్రం పైన గ్రంధాన్ని వ్రాయమని చాలామంది నన్ను గతంలో కోరారు. ప్రస్తుతం కూడా కోరుతున్నారు. అందువల్ల నా కలం నుండి వెలువడుతున్న 61 వ గ్రంధంగా ఈ గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

ఇది నా అభిమాన టాపిక్స్ లో ఒకటి. చాలా చిన్నవయసులో ఈ సబ్జెక్ట్ ను నేను అధ్యయనం చేయడం జరిగింది. అప్పటినుండి ఇది నా అభిమాన విషయాలలో ఒకటిగా మారింది. దానికి కారణాలున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ కు, శ్వాస సాధనకు, ప్రాణనిగ్రహానికి ఉన్న సంబంధము, స్వరశాస్త్రం పైన నాకున్న అభిమానాన్ని పెంచింది. జ్యోతిష్యశాస్త్రానికి స్వరశాస్త్రానికి ఉన్న సంబంధం ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. శ్వాస పైన అదుపు లేకుండా యోగసాధన లేదు. కనుక, యోగశాస్త్రంలో ఇది కోర్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.

ఈ గ్రంధం తంత్రసాహిత్యానికి చెందినది. మధ్యయుగాలలో ఈ గ్రంధము రచింపబడినప్పటికీ, దీనిలోని భావనలు, అభ్యాసములు అంతకుముందు ఎన్నో వేలఏండ్ల క్రిందటివి.

మనదేశంలో ముస్లిం దురాక్రమణ దారులు జరిపిన రాక్షస విధ్వంసకాండలో ఇటువంటి ఎన్నో వేలాది గ్రంధాలు నాశనమైనాయి. కోట్లాదిమంది హిందువులు, వేలాదిమంది గురువులు చంపబడ్డారు. గురుకులాలు, ఆశ్రమాలు, లైబ్రరీలు గోరీలదొడ్లుగా మార్చబడ్డాయి. ఆ అరాచక రాక్షస చర్యలనుండి బ్రతికి బట్టగట్టిన అమూల్యములైన గ్రంధాలలో ఇదీ ఒకటి.

ఈ గ్రంధం ఈనాడు మనకు లభిస్తూ ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇన్నేళ్లకు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా సుకృతమని భావిస్తున్నాను.

ఈ గ్రంధంలో చెప్పబడిన కొన్ని విధానములు నా సుదీర్ఘ ఉద్యోగపర్వంలో నన్ను ఎంతో ఆదుకున్నాయి. అవినీతితో నిండి, అడుగడుగునా నక్కలు తోడేళ్ళ వంటి మనుషులున్న రైల్వేవ్యవస్థలో, కులపిచ్చితో, వ్యక్తిగత దురహంకారాలతో నన్ను హింసపెట్టి నా రికార్డ్ పాడుచేయాలని చూచిన పై అధికారులతో వ్యవహరించేటపుడు ఈ స్వరశాస్త్ర విధానములను ఉపయోగించి సత్ఫలితములను పొందాను. 

అదేవిధంగా, చిన్నాపెద్దా అనారోగ్యములు కలిగినపుడు, కలుగబోతున్నపుడు, స్వరశాస్త్రమును ఉపయోగించి వాటిని తేలికగా నివారించుకోగలిగాను. 

కనుక ఇది నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగపడే శాస్త్రమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు శ్రీలలిత, అఖిలలకు, శిష్యులు ప్రవీణ్, శ్రీనివాస చావలి లకు నా ఆశీస్సులు.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి వచ్చిన మిగిలిన గ్రంధములను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.

త్వరలో మా ఆశ్రమంలో జరుగబోయే రిట్రీట్స్ లో ఈ స్వరశాస్త్రము యొక్క ప్రాక్టికల్ ఉపయోగాలను నా శిష్యులకు ఆచరణాత్మకంగా నేర్పించడం జరుగుతుంది.

read more " మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల "

8, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 80 (మా క్రొత్త పుస్తకం 'యోగబీజము' విడుదల)

నా కలంనుండి వెలువడుతున్న 59 వ పుస్తకంగా మహాసిద్ధుడైన శ్రీగోరక్షనాథులు రచించిన ప్రాచీన సంస్కృతగ్రంధము 'యోగబీజము'నకు నా వ్యాఖ్యానమును అమెరికానుండి నేడు విడుదల చేస్తున్నాను.

అమెరికా వచ్చిన ఈ ఐదునెలల కాలంలో నేను వ్రాసిన తొమ్మిదవ గ్రంధం ఇది. చాలా అరుదైన సిద్ధయోగ గ్రంధములలో ఇదీ ఒకటి.

అద్భుతమైన మన సనాతనధర్మములో లక్షలాది గ్రంధములు తురకల దండయాత్రలలో ఘోరాతిఘోరంగా తగులబెట్టబడినాయి. నలందా బుద్ధవిహారం లోని లైబ్రరీ ఒక్కటే మూడునెలలపాటు తగలబడుతూనే ఉందంటే అందులో ఎన్ని లక్షలాది గ్రంధములు అగ్నికి ఆహుతయి పోయాయో, ఎంతటి తరతరాల రీసెర్చీ, విజ్ఞానసంపదా నాశనమై పోయిందో అర్ధం చేసుకోవచ్చు మన భారతదేశమునకు, హిందూమతమునకు తురకరాక్షసులు చేసిన హాని మాటలలో చెప్పగలిగేది కాదు. ఆ విధంగా నెలలతరబడి మంటలకు ఆహుతి కాగా మిగిలిన కొన్ని గ్రంధములే ప్రస్తుతం మనకు అమిత సంభ్రమాశ్చర్యములను కలిగిస్తున్నాయి. మనకే గాక, యూరోప్, అమెరికా మొదలైన ఇతరదేశస్థులు వీటిని చదివి వీటిలోని జ్ఞానసంపదకు బిత్తరపోతున్నారు. ఇంగ్లీష్ లోకి, ఇతర యూరోపియన్ భాషలలోకి వీటిని అనువాదం చేసుకుని అనుసరిస్తున్నారు. వీటిని ఆచరిస్తున్నారు. ఎంతోమందికి యోగాభ్యాసమును నేర్పుతున్నారు.

హిందూమతమును అనుసరించే అమెరికన్లు నేడు వేలాదిమంది ఉన్నారు. బైటకు చెప్పకపోయినా, అభిమానించేవారు లక్షలలో ఉన్నారు. యోగాను చేస్తున్నవారు కోట్లలో ఉన్నారు. అమెరికాలో ప్రతి ఇంటిలో యోగా చేస్తున్నారు, ప్రాణాయామం చేస్తున్నారు. నేను చూచి, చాలా ఆశ్చర్యపోయాను. సరిగ్గా చెప్పాలంటే, మన ఇండియాలో కూడా ఇంతగా యోగాభ్యాసమును మనం చేయడం లేదు. వీళ్ళు చేస్తున్నారు.

నేడు అమెరికాలో, యూరప్ లో శివభక్తులు, కృష్ణభక్తులు,  దేవీభక్తులు, యోగులు ఎంతో మంది ఉన్నారు. ఇది వారి అదృష్టం. ఇండియాలో హిందూమతం నుండి ఇతరమతాలలోకి  ప్రతిరోజూ మారుతున్నారు. అది వారి దరిద్రం.

సిద్ధయోగసాధనను వివరిస్తూ చెప్పబడిన అతి ముఖ్యములైన గ్రంధములలో 'యోగబీజము' ఒకటి. నాశనం కాకుండా ఇది మనకు లభించడము మనందరి అదృష్టం.  ఈనాడు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా అదృష్టం.

మామూలు యోగసాధనకు, సిద్ధయోగసాధనకు గల భేదములను ఈ గ్రంధము స్పష్టముగా వివరిస్తుంది. జ్ఞానికంటే యోగి ఉత్తముడని ఇది చెబుతుంది. భగవద్గీత 6 వ అధ్యాయము 46 వ శ్లోకం కూడా దీనినే చెప్పినది.

శ్లో || తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 6. 46 ||  

'తపస్వులకంటే యోగి అధికుడు. జ్ఞానులకంటే యోగి అధికుడు. కర్మిష్ఠులకంటే యోగి అధికుడు. కనుక ఓ అర్జునా ! నీవు యోగివి కా !'

యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతం యొక్క మహత్తరమైన ప్రాచీనవిజ్ఞానమును అర్ధం చేసుకోండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 80 (మా క్రొత్త పుస్తకం 'యోగబీజము' విడుదల) "